వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మద్యపానానికి బానిసైన గజ్జెల్లి అశోక్ (35), అనే తాపీ మేస్త్రి రెబ్బెన మండలం, గోలేటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే అశోక్కు 11 సంవత్సరాల క్రితం రమ్యతో వివాహం కాగా వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అశోక్ గత 6 సంవత్సరాలుగా మంథని మండలం, రామయ్యపల్లిలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తూ, అక్కడ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అశోక్, మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన భార్యతో గొడవపడేవాడు. ఈ విషయంలో అశోక్ తల్లి శశికళ అతడికి అంతలా సర్ది చెప్పిన అశోక్ ప్రవర్తన లో మార్పు రాలేదు. ఇదిలా ఉండగా గత నెల 30వ తేదీన, ఎప్పటిలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, తన భార్యతో గొడవపడి, రెబ్బెన మండలం, గోలేటిలో నివసిస్తున్న తన తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే, సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, రాత్రి 10.30 గంటలకు ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అతని తల్లి అంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో, ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు తెరిచి చూడగా, అతను ఇంట్లోని ఉరి వేసుకుని కనిపించాడు. ఆ తర్వాత 108కి సమాచారం అందించగా, అతడిని అంబులెన్స్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అశోక్ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి శశికళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం