వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ సి.వి. ఆనంద్తో కలిసి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖలతో వర్ష పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.24×7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, ఎస్డీఆర్ఎఫ్–ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పాత భవనాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం, జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టామని, వాగులు, నదులు, కల్వర్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు వెళ్లకుండా నిఘా పెంచామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.సమావేశంలో డీసీపీ ఎ. భాస్కర్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం