వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : *భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్* కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుండి గ్రామం వద్ద గుండి వాగుపై నిర్మిస్తున్న గుండి బ్రిడ్జ్ ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నదని, దీనిని ఒక హై-లెవెల్ వంతెనగా 2007 లో 'నాబార్డ్' నిధులు మంజూరు చేసిందని, అపుడే నిర్మాణం ప్రారంభించి 2010 లోగా పూర్తి చేయాల్సిన వంతెనే అయినా,2026 కూడా ఈ వంతెన ఇంకా నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయిందిని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇన్ని సంవత్సరాలు సాక్ష్యం అని *భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్* అన్నారు. ఇప్పటివరకు కేవలం 11 పిల్లర్లు మాత్రమే నిర్మించారు, వాటిపై కాంక్రీట్ స్లాబ్లు వేయాల్సి ఉంది. నిజానికి ఈ వంతెన నిర్మాణానికి మొదట ₹8.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినప్పటికీ. కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న తీవ్ర ఆలస్యం కారణంగా, ప్రాజెక్ట్ వ్యయం ₹14.40 కోట్లకు పెంచి కాలయాపన చేస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని కార్తీక్ అన్నారు.గుండి వాగుపై వంతెన నిర్మించకపోవడం కారణంగా స్థానిక 15 గ్రామాలపై ప్రభావం పడుతున్నదని, శాశ్వత వంతెన అందుబాటులో లేకపోవడం వల్ల గుండి మరియు దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవని, ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ గుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, దీనివల్ల ఈ గ్రామానికి ఆసిఫాబాద్ పట్టణంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని, ప్రజలు తెప్పలపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారని, సరైన వంతెన లేకపోవడంతో స్థానికులు నాటు పడవలు లేదా థర్మాకోల్ తెప్పలపై ప్రాణాలకు తెగించి ఉధృతమైన వాగును దాటాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అత్యవసర వైద్య సమయాల్లో గర్భిణీ స్త్రీలు లేదా ముసలివారు, లేదా ఏదైనా ప్రమాదం జరిగితే వాగు దాటించేందుకు దారిలేక ప్రజల ప్రాణాలపై ఆశలు వదులుకునే దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.* పిల్లలు పాఠశాలలకు వెళ్లేటప్పుడు మరియు రోజువారీ పనుల నిమిత్తం వెళ్లేటప్పుడు ఇది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండకాలంలో వాగు ఎండిపోయినప్పుడు స్థానికులు వాగుపై తాత్కాలికంగా మట్టి రోడ్లు వేసుకుంటున్నప్పటికీ తర్వాత వర్షాకాలపు భారీ వర్షాలు పడగానే అవి కొట్టుకుపోతాయని. ఇది పరిపాటిగా మారిందని అన్నారు.ఈ దీర్ఘకాలిక ఆలస్యం స్థానిక ప్రజలలో తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని, ఆగ్రహాన్ని నింపిందని బ్రిడ్జి నిర్మాణం గనక పూర్తి చేయకపోతే దాదాపు 20 ఏళ్లుగా రాజకీయ నాయకులు ఇస్తున్న బూటకపు వాగ్దానాలతో విసిగిపోయిన గ్రామస్తులంతా ఏకమై "వంతెన లేకపోతే - ఓటు లేదు / ఎన్నికలు లేవు" అంటూ ప్రజలు ఎన్నికలను సైతం బహిస్కరించినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని దీనికంటే మరో దుర్మాగం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. అంతేకాదు స్థానిక ఎం.ఎల్.ఏ, ఇంచార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లు వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ, అవి నోటిమాటకే పరిమితం అయ్యాయని చేతల వరకు రాలేదని, ఇకనైనా 15 గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, వంతెన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయకపోతే అదే 15 గ్రామాలను కలుపుకుని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. అలాగే వంతెన నిర్మాణం పూర్తి చేయకపోతే ప్రజాప్రతినిధులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని గొడిసెల కార్తీక్ హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్,ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, గ్రామ నాయకులు రాహుల్, శంకర్, దిలీప్, సావిత్రి, సోనీ, హారిక, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.*
Reporter
వాస్తవ గమ్యం